TYPES OF VOTE : మీకు తెలుసా.. ఓటు ఎన్ని రకాలుగా వేయవచ్చో..?
పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుంటే ఓటు హక్కు వస్తుంది. ఎన్నికలప్పుడు వారు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేస్తారు. దీంతోపాటు మరి కొన్ని రకాల ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. వాటిలో చాలా మందికి ‘పోస్టల్ బ్యాలెట్’ గురించి మాత్రమే తెలుసు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, రక్షణ దళాల్లో ఉండే సిబ్బందికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. మరికొన్ని ఓట్లు లెక్కింపులోకి రానప్పటికీ వాటికీ ప్రత్యేకతలున్నాయి. ఆ ఓట్లు పలు సందర్భాల్లో అభ్యర్థి విజయంపై ప్రభావం చూపుతాయి. వాటిని ‘నమూనా ఓట్లు, టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లు, టెస్టు ఓట్లు’ అని అంటారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటును పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమే కాకుండా... ఐదు రకాలుగా అవకాశాలు కల్పించింది. అంటే... ఒక్కఓటు.. ఐదు రకాలన్న మాట.
సాధారణ ఓటు...
18 ఏళ్లు నిండిన పౌరులు దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. వీరు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తారు. దీనిని సాధారణ ఓటుగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలోనే అత్యధిక శాతం పోలింగ్ జరుగుతుంది.
టెండర్ ఓటు...
ఓటరు జాబితాలో పేరుండి పోలింగ్ కేంద్రం వద్దకు పోయేసరికి తమ ఓటును ఇంకొకరు వేశారనుకోండి... ఆ తర్వాత అసలైన ఓటరు వస్తే.. టెండరు ఓటు వేసే అవకాశం ఉంది. దీనిని టెండరు ఓటు అంటారు.
సర్వీస్ ఓటు...
సరిహద్దుల్లో సైనికులు, పారా మిలటరీ దళాల ఉద్యోగులు ఈ విధానంలో ఓట్లు వేస్తారు. వీరంతా స్వగ్రామాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఎన్నికల సంఘం వీరికి సర్వీస్ ఓటు వేసే అవకాశం కల్పించింది.
ప్రాక్సీ ఓటు...
తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయించే ప్రక్రియను ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఇటువంటి విధానాన్ని వినియోగించుకుంటారు. ఇటువంటి ఓట్లు తక్కువగా కనిపిస్తుంటాయి.
పోస్టల్ బ్యాలెట్....
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే వీలుండదు.దీంతో వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టు ద్వారా తాము వేయదలుచుకున్న అభ్యర్థికి ఎన్నికల సిబ్బంది ఓటు వేసుకుంటారు. కాబట్టి ఈ పద్దతిలో ఓటు వినియోగించుకోవడాన్ని పోస్టల్ బ్యాలెట్ అంటారు.
Comments
Post a Comment