Telangana Govt Jobs| తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై సీఎస్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో 80,309 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటన చేసిన నాటి నుంచి నిరుద్యోగులకు నోటిఫికేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ సైతం ప్రారంభించారు.
అయితే.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ ఉద్యోగాలకు ఏ నియామక సంస్థను ఎంపిక చేయాలన్న విషయంపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈ వివరాలను సీఎస్ ఈ నెల 18న లేదా మార్చి 19న సీఎం కేసీఆర్ కు నివేదించనున్నారు. సీఎం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు నియామకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి ఆర్థిక శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఖాళీలు, సర్వీస్ నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజ్వరేషన్లు, రోస్టర్ తదితర సమాచారన్ని ఆర్థిక శాఖకు అందిస్తే వెంటనే అనుమతులు ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు.
ఆ వెంటనే సంబంధిత నియామక సంస్థ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సీఎస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలసి సీఎస్ సూచించారు. గందరగోళానికి అవకాశం రానివ్వకుండా వ్యవహరించాలని ఆదేశించారు.
అయితే.. మొత్తం 80 వేల ఖాళీల్లో తాము 18 వేల ఖాళీల భర్తీకి సిద్ధంగా ఉన్నామని పోలీస్ శాఖ వెల్లడించినట్లు సమాచారం. అయితే సీఎం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మంచి రోజు చూసి నోటిఫికేషన్ విడుదల చేయాలని హోం శాఖ అధికారులకు సీఎస్ సూచించారు.
ఇదిలా ఉంటే టెట్ నోటిఫికేషన్ సైతం త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. టెన్ అనంతరం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతుందని సమాచారం. ఈ అంశాలపై విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
Comments
Post a Comment